భువనేశ్వర్: కరోనా భయం ఆత్మీయ అనురాగాల్ని ఛిన్నాభిన్నం చేసింది. అనారోగ్యంతో కన్ను మూసిన వ్యక్తి అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబీకులు, బంధుమిత్రులు, గ్రామస్తులు అమానుషంగా నిరాకరించారు. కెంజొహార్ జిల్లా బలభద్రపూర్ గ్రామంలో ఈ విచారకర సంఘటన వెలుగుచూసింది. మెజిస్ట్రేట్ సమక్షంలో స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృత దేహాన్ని పోస్ట్మార్టం కోసం తరలించారు. ఆరోగ్య సేవ కార్యకర్తలు ఈ ప్రక్రియలో సహకరించారు.
బెంగళూరులో సెక్యురిటీ గార్డుగా పనిచేసిన రంజన్ ప్రధాన్ గత నెల 10వ తేదీన కెంజొహార్ జిల్లా బలభద్రపూర్ స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. కరోనా కట్టడి కార్యాచరణలో భాగంగా ఆయనకు నిర్ధారించిన 14 రోజుల దిగ్బంధం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. అయితే ఆయన ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించడంతో ఆస్పత్రికి తరలించేలోగా ఆదివారం కన్నుమూశాడు. ఇటీవల కరోనా దిగ్బంధం నుంచి బయటపడిన స్వల్ప వ్యవధిలో ఇలా జరగడంతో కరోనా మహమ్మారే బలిగొన్నట్లు భావించిన గ్రామస్తులు మృతదేహాన్ని తాకేందుకు నిరాకరించి దూరమయ్యారు.